Operation Sindoor : యూఎస్కు శశిథరూర్.. యూకేకు రవిశంకర్ బృందం

Operation Sindoor : భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు.
ఏడుగురు వీరే..
కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్, బీజేపీ పార్టీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీ-యూ నుంచి సంజయ్కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ-ఎస్పీ నుంచి సుప్రియా సూలె, శివసేన నుంచి శ్రీకాంత్ శిందే బృందాలకు నేతృత్వం వహిస్తారు. భారత్ తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ యవనికపై చాటడం ఉద్దేశంగా ఐరాస భద్రతా మండలిలోని దేశాలకు బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఏయే బృందాలు ఏయే దేశాలకు వెళ్తాయనే జాబితాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా వెల్లడించారు.
బృందాలు..
-బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం : సౌదీఅరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా వెళ్లనుంది.
-రవిశంకర్ ప్రసాద్ బృందం : యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాలకు వెళ్లనుంది.
-సంజయ్కుమార్ ఝా బృందం : ఇండోనేసియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ వెళ్తాయి.
-శ్రీకాంత్ శిందే బృందం : యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ వెళ్లనుంది.
-శశిథరూర్ బృందం : అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు వెళ్తాయి.
-కనిమొళి బృందం : స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా వెళ్తాయి.
-సుప్రియా సూలె బృందం : ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లనుంది.