Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో పెండ్లి వేడుకకు హాజరయ్యారు. అనంతరం వాన్లో తిరుగు ప్రయాణం అవుతుండగా వాహనం పిండవాల్ హిలావాడి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన..
పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న మరికొందరు జరిగిన ప్రమాదాన్ని చూశారు. బైకులపై వెళ్తున్న వారు ఆగి, గాయపడిన వారికి సాయం చేసేందుకు మరికొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ లారీ వేగంగా వచ్చింది. సాయం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు బైక్లు లారీ కింద చిక్కుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్ అధికారి తెలిపారు. మరో 8 మందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.