MP Dharmapuri Arvind : శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది : ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

MP Dharmapuri Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎంను మార్చాలని అధిష్ఠానం ఆలోచిస్తోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యే అన్ని అర్హతలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదన్నారు. అందుకే అధిష్ఠానం వెనకడుగు వేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడటం, అధిష్ఠానానికి మూటలు పంపించడం శ్రీధర్ బాబుకు కూడా తెలిసి ఉంటే.. సీఎం అయ్యేవారని జోస్యం చెప్పారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రేవంత్ పెద్ద జోకర్..
మరోవైపు గురువారం కూడా అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ తెలంగాణలో బలపడిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు రేవంత్ని తురుంఖాన్ అనుకున్నారని, కానీ ఆయన జోకర్ అని ముఖ్యమంత్రి అయిన తర్వాతే తేలిపోయిందని విమర్శించారు.