MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని 8గంటలు విచారించిన సిట్

MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణ ముగిసింది. ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్రెడ్డిని దాదాపు 8గంటలపాటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఎంపీ స్టేట్మెంట్ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై అధికారులు ఆరా తీశారు. దీంతో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసులో మరోసారి మిథున్రెడ్డిని పిలిచే అవకాశ ఉంది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం న్యాయవాది సమక్షంలో ఎంపీ మిథున్రెడ్డిని విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, ఆయన ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆడాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతవరకు కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి, అతడి అనుచరులు చాణక్యరాజ్, అవినాష్రెడ్డిలతో మిథున్రెడ్డికి సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు సంధించారు. కొన్ని ప్రశ్నలకు ఎంపీ మిథున్రెడ్డి దాటవేసినట్లు సమాచారం.
ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది : మిథున్రెడ్డి
కూటమి ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు తమ కుటుంబంపై ఎన్నో కేసులు పెట్టినా ఏ ఒక్కటి నిరూపించలేకపోయిందని విమర్శించారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనన్నారు. సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో తాను ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు.