Tahawwur Rana : తహవూర్ రాణా కేసు.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్

Tahawwur Rana : ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహవూర్ రాణాను అగ్రరాజ్యం అమెరికా సర్కారు ఇండియాకు అప్పగించగా, దీంతో అతడిని అధికారులు ఇండియాకు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానం అమెరికా నంచి భారత్కు బయల్దేరింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు.
తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు..
నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అగ్రరాజ్యం నుంచి బయల్దేరింది. బుధవారం ఉదయం 7.10 (భారతీయ కాలమానం) గంటలకు బయల్దేరిన విమానం గురువారం మధ్యాహ్ననికి ఢిల్లీ చేరుకుంటుందని చెప్పారు. ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలిస్తుంది. దీంతో తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
16 ఏళ్ల క్రితం..
16 ఏళ్ల కింద అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబయిలో మారణహోమానికి ఒడిగట్టారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబయిలోకి ప్రవేశించి, నగరంలో మారణహోమాన్ని సృష్టించారు ముఠా. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబయి చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. దీంతో 18 మంది భద్రతా సిబ్బందిపాటు 166 మందిని పొట్టనపెట్టుకున్నారు. దాడుల్లో తహవూర్ రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. దాడి జరిగిన ఏడాది తర్వాత 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రాణా ప్రధాన సూత్రదాడిగా తేలాడు. రాణాకు పాకిస్థాన్లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నది.