Published On:

Israel attack on Gaza: ఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 103 మంది మృతి!

Israel attack on Gaza: ఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 103 మంది మృతి!

103 Gaza People died in Israel Attack: గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారం వరకు జరిపిన దాడుల్లో 103 మంది ప్రజలు చనిపోయారు. తాజాగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న భవనాలు, క్యాంపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే ఇండోనేసియా ఆస్పత్రిపై కూడా దాడులు జరిగాయి. ఇందులో ఖాన్ యూనిస్ లో 48, నార్త్ గాజాలో 29, జబాలియాలోని రెఫ్యూజ్ క్యాంప్ లో 26 మంది చనిపోయారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 18 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు.

 

జబాలియాలోని రెఫ్యూజ్ క్యాంపులో తలదాచుకుంటున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియాలోని ఓ ఇంటిపై జరిగిన వైమానికి దాడిలో 10 మంది చనిపోయారు. అయితే ప్రజలను అడ్డుపెట్టుకుని హమాస్ తీవ్రవాదులు తమపై దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

సాధారణ ప్రజలు నివసిస్తున్న ఏరియాల్లోనే హమాస్ మిలిటెంట్లు తలదాచుకుంటున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తాజా దాడులపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ మిలిటెంట్లు తూట్లు పొడుస్తున్నారని మండిపడింది. కాగా మరోసారి కాల్పుల విరమణపై ఒప్పందం జరిగితేనే గాజాపై దాడులు ఆపుతామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తమ వాళ్లను విడుదల చేయడానికి హమాస్ నిరాకరిస్తున్నదని, అందుకే దాడులు చేస్తున్నామని తెలిపింది.

 

తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ కు చెందిన దివంగత నేత యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతదేహం ఓ సొరంగంలో దొరికినట్లు తెలుస్తోంది. సిన్వర్ లక్ష్యంగా దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది.