Published On:

India- Pakistan: పాక్ పై భారత్ మరింత ఒత్తిడి.. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి

India- Pakistan: పాక్ పై భారత్ మరింత ఒత్తిడి.. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి

Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ దేశంతో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య, వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే ఆ దేశ పౌరులను భారత్ నుంచి బహిష్కరించింది. అందులో భాగంగానే సింధు జాలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది.

 

అందులో భాగంగానే భారత్ నుంచి సింధూ నది ద్వారా వెళ్తున్న నీటిని కేంద్రం నిలుపుదల చేసింది. ఈ చర్యలు పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ దేశంలో ప్రధాన నీటివనరు సింధూ జలాలే. దీంతో నీటి వనరుల కోసం దాయాది దేశం ఇబ్బందులు పడుతోంది. తాజాగా పాకిస్తాన్ తాగు, సాగునీరు లభ్యత కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అలాగే ఖరీఫ్ లో పంటలకు నీటి లభ్యత లేకపోవడంతో పంటలు భారీగా ఎండిపోతున్నాయట. ఈ ఘటనలతో దాయాది పాక్ కాళ్ల బేరానికి వస్తోంది. ఈ మేరకు సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని పాకిస్తాన్ పలుమార్లు భారత్ కు లేఖలు రాసింది. కానీ ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదని ప్రధాని మోదీ లేఖలను బుట్టదాఖలు చేశారు.

 

తాజాగా సింధూ జలలపై కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. జమ్ముకాశ్మీర్ లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందంలో భాగంగా సింధూ, దాని ఉపనదులపై భారత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడం సమస్యగా మారింది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో నీటి నిల్వలను పెంచుకునే అవకాశం దొరికింది. కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభ దశలో ఉండటంతో పలు మార్పులు చేస్తోంది. వాటిల్లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కానీ వీటి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. వీటిల్లో సింధూ నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్ట్, చీనాబ్ పై కిర్తాయ్-2, సవల్ కోట్, జీలం ఉరి- 1,2 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. వీటి నీటి సామర్థ్యం పెంచేందుకు కేంద్రం రెడీ అవుతోంది.