Tirumala Information: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల టైం

Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు మగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించినా.. భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూనే ఉన్నారు. దీంతో భక్తులతో తిరుమల కొండ రద్దీగా మారింది. ఎక్కడ చూసినా భక్తుల జన సందోహం కనిపిస్తోంది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి షెడ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3 నుంచి 4 గంటల సమయం అవుతోంది. నిన్న శ్రీవారిని 79, 296 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 33,511 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.
ఇక తిరుమలలో నిన్నటితో స్వామివారి సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు ముగిశాయి. ప్రతిఏటా జ్యేష్టామాసంలో పౌర్ణమితో కలుపుకుని రెండు రోజులు ముందు నుంచి శ్రీవారికి జ్యేష్టాభిషేకం చేయడం ఆనవాయితీ. దీంతో ఆలయంలో ఆర్జీత సేవలను రద్దు చేశారు. తాజాగా జ్యేష్టాభిషేక మహోత్సవాలు పరిసమాప్తం కావడంతో ఆలయంలో ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ అనుగుణంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. ఈ వారాంతం వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.