Operation Sindhu: ‘ఆపరేషన్ సింధు’ మొదలైంది: భారత విదేశాంగ శాఖ!
Operation Sindhu Launched: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ సింధు’అని నామకరణం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఉత్తర ఇరాన్ నుంచి ఈ నెల 17న ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వీరు ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు బయలు దేరారు. ఈ నెల 19న తెల్లవారు జామున న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. విదేశాల్లో ఉన్న తన ప్రజలను భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. వెంటనే నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్య అధికారులతో కాంటాక్టు అవ్వాలని కోరింది.
ఢిల్లీ తెలంగాణ భవన్లో హెల్ప్లైన్..
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో ఇరుదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ ప్రారంభించింది. ఇప్పటివరకు రాష్ట్రవాసులు ఎవరూ ప్రభావితం అయినట్లు సమాచారం లేకపోయినా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్తగా హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హెల్ఫ్ లైన్ నంబర్లను సంప్రదించాలని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
వందన-రెసిడెంట్ కమిషనర్ పీఎస్ :+91 9871999044
జి.రక్షిత్నాయక్, లైజన్ ఆఫీసర్ : +91 9643723157
జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ : +91 9910014749
సీహెచ్.చక్రవర్తి, పౌరసంబంధాల అధికారి : +91 9949351270