Published On:

Sindhu Water: భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ లో తీవ్ర నీటి ఎద్దడి

Sindhu Water: భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ లో తీవ్ర నీటి ఎద్దడి

Operation Sindoor: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో దాయాది పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఆదేశంతో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్ నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న నీటిని ఆపేసింది. దీంతో పాకిస్తాన్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ లోని జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోయాయి. సింధు బేసిన్ లో 15 శాతం మేర నీటి ప్రవాహం తగ్గిపోయింది.

 

దీంతో వేసవిలో పంటలు ఎండిపోయి రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. పంజాబ్ ప్రావిన్స్ లో నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా. తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట దగ్గర సింధూ నది నీటిమట్టం 1465 మీటర్లకు పడిపోయింది. కనిష్ట స్థాయి నీటిమట్టం 1402 మీటర్లుగా ఉంది. మరోవైపు పంజాబ్ లోని చస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 644 మీటర్లుగా ఉందని పాక్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ 638 మీటర్ల దగ్గరకు నీటిమట్టం చేరినట్టు సమాచారం. ఇక చీనాబ్ నదిలో నీటి ప్రవాహం మే 28న 26, 645 క్యూసెక్కులు ఉండగా, జూన్ 5 నాటికి 3వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో పాకిస్తాన్ లోని పంజాబ్ లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. సింధూ జలాల ఒప్పందంపై పునరాలోచించాలని ఇప్పటికే పాకిస్తాన్.. భారత్ కు లేఖ రాసింది. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకూ తమ నిర్ణయంలో మార్పు ఉండదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు.