Last Updated:

Tirumala: శ్రీవారి దర్శనాలు, సేవల్లో మార్పులు చేసిన టీటీడీ.. ఎందుకంటే?

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది. గత వారం రోజులుగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది.

Tirumala: శ్రీవారి దర్శనాలు, సేవల్లో మార్పులు చేసిన టీటీడీ.. ఎందుకంటే?

Tirumala: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది. గత వారం రోజులుగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది.

వారాంతాలు అయిన శుక్ర, శనివారాల్లో అయితే శ్రీవారి దర్శనానికి ఇంకా ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల కోసం జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

సేవలు, దర్శనాల్లో మార్పులు(Tirumala)

శుక్ర, శనివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. దీంతో 20 నిమిషాల పాటు సమయం ఆదా అవుతుందన్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని.. దీంతో 30 నిమిషాల సమయం కలిసి వస్తుందన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే ఆ టైంలో బ్రేక్‌ దర్శనం కల్పిస్తామన్నారు.

దీంతో ప్రతి రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాదిమంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్లత తొందరగా స్వామి వారి దర్శనం లభిస్తుందన్నారు. టీటీడీ నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.