KKR Vs RR: చెలరేగిన బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స లో సాగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్ కతా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అసలై ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కోల్ కతా, రాజస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై కీలకమైన మ్యాచ్ లో కొల్ కతా బ్యాటర్లు రాణించారు. మరోవైపు అండ్రీ రస్సెల్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సులతో రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్ లు కొట్టి 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే రఘువంశీ 44, గర్భాజ్ 35, రహానే 30 పరుగులు చేశారు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. రాజస్థాన్ బౌలర్లలో యుద్ వీర్ సింగ్, తీక్షణ, పరాగ్, ఆర్చర్ తలో వికెట్ తీసుకున్నారు.
కాగా బ్యాటింగ్ కు వచ్చిన కోల్ కతాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ లోనే నరైన్ (11) ఔటయ్యాడు. దీంతో గర్భాజ్, రహానే కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేవరకు వికెట్ నష్టానికి కోల్ కతా 56 పరుగులు చేసింది. అనంతరం గుర్భాజ్ (35) ఔట్ అవగా.. రహానే, రఘువంశీ మరో చక్కటి ఇన్నింగ్స్ నెలకొల్పారు. రహానే (30) ఔటైన తర్వాత అండ్రీ రస్సెల్ తన పవర్ చూపించాడు. పవర్ బ్యాటింగ్ తో కోల్ కతా స్కోర్ బోర్డ్ ను 200 దాటించాడు.