Last Updated:

Traffic Restrictions: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు ఆ రోడ్లు మూసివేత

ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్‌ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.

Traffic Restrictions: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు ఆ రోడ్లు మూసివేత

Traffic Restrictions: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌ నగరాల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నిర్వహిస్తుండగా తాజాగా వీటి సరసన హైదరాబాద్ కూడా చేరింది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యూట్ ఓవర్‌ లుకింగ్‌పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ను నిర్మించారు అధికారులు. ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ కార్ల రేసింగ్ ట్రయల్ రన్ నిర్వహించడానికి సమాయాత్తమైంది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇవ్వాళ్టి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ రాత్రి 10 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు.

దారి మల్లింపులు
ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. అలాగే- బుద్ధ భవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్/ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు దారి మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు రాకపోకలు జరిపే వాహనాలను రవీంద్రభారతి, కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లించారు.

ఐదు రోజులు ఆ రోడ్లు మూసివేత

ఫార్ములా ఈ కార్ల రేసింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్‌ రోడ్లను శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌ మీదుగా కాకుండా తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, కట్ట మైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: దేవరయాంజాల్ భూములు ప్రభుత్వానివే.. తేల్చేసిన కమిటీ

ఇవి కూడా చదవండి: