Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. ప్రధాని మోదీ ఆరా
PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఇక వరదల్లో ఇప్పటివరకు 34 మంది మరణించినట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. కాగా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ మాట్లాడారు.
కాగా ఆయా రాష్ట్రాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కేంద్ర బలగాలను పంపుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు అస్సాంలో వరద పరిస్థితిని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రధాని మోదీకి వివరించారు. వరదల ధాటికి కొన్నిప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు.