PM Modi: ట్రకోమా రహిత దేశంగా భారత్ : ప్రధాని మోదీ

PM Modi: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ట్రకోమా రహిత దేశంగా ఇండియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకోసం కృషిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ 123వ మన్కీ బాత్ ఎపిసోడ్ నేడు ప్రసారమైంది. మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను అభినందించారు. ఈ నెల 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో దేశ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. దాదాపు పదేళ్ల క్రితం మొదలైన కార్యక్రమం ఏటా మరింత విస్తరిస్తోందన్నారు. చాలామంది ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారన్నారు. నాడు జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారన్నారు. కానీ, భారత ప్రజలు శక్తిమంతమైన వారు కావడంతోనే ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. దానిని విధించిన వారు ఓడిపోయారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, బాబూ జగ్జీవన్ రామ్ వంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్ మారిందని అభినందించారు. పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. దేశంలోని చిన్నారులకు వీరు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్నెస్, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాని సూచించారు.
మేఘాలయ ఎరీసిల్క్కు జీఐ ట్యాగ్ లభించిందని అభినందించారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దీన్ని ప్రత్యేకతన్నారు. తెలంగాణ భద్రాచలంలోని ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి హైదరాబాద్ నుంచి లండన్కు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. మహిళలే మూడు నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారన్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో బౌద్ధక్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు.