Shashi Tharoor in BJP: నేను అలా మాట్లాడటం బీజేపీలో చేరడానికి సంకేతం కాదు: శశిథరూర్

Shashi Tharoor gives clarity on Joining in BJP: నరేంద్ర మోదీ సర్కారుకు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా శశిథరూర్లో బీజేపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఊహాగానాలపై తాజాగా ఆయన స్పందించారు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వివరించిన వ్యాసం అది అని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల ఐక్యతను అది చెబుతోందన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు బలపర్చుకోవడంలో ప్రధాని శక్తి, చైతన్యం ప్రదర్శించారని తాను చెప్పానని తెలిపారు. ఇది బీజేపీ పార్టీ లేక కాంగ్రెస్ విదేశాంగ విధానాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. ఇది భారత విదేశాంగ విధానం గురించి మాత్రమేనని చెప్పుకొచ్చారు. తాను 11 ఏళ్ల కింద పార్లమెంట్ విదేశాంగ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే విషయం పేర్కొన్నట్లు తెలిపారు. తాను ఇలా మాట్లాడటం బీజేపీ పార్టీలో చేరడానికి సంకేతం కాదన్నారు. ఇది జాతీయ ఐక్యతకు సంబంధించిందని పేర్కొన్నారు.
థరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం నిన్న ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ సర్కారు విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా ఆయన పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన దౌత్యపరమైన కృషి జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువుగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సిందూర్తో భారత్ దృఢమైన ప్రతిస్పందనను చాటిచెప్పిందని తెలిపారు. ఇది మన విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.