Missing In Godavari: తీరని విషాదం.. గోదావరిలో ఆరుగురు గల్లంతు
Medigadda Barrage: ఆనందంగా బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన వారి ఇంట విషాదం అలముకుంది. సరదాగా ఈతకు వెళ్దామని గోదావరిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఘటన జరిగింది.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలు జరిగాయి. బంధువులు అంతా మల్లయ్య ఇంట్లోనే ఉన్నారు. వారిలో ఎనిమిది మంది యువకులు గోదావరి ఈత కొట్టేందుకు నిన్న సాయంత్రం మేడిగడ్డ వద్ద నదిలోకి దిగారు. అందులో ఓ యువకుడు నీటిలో దిగగా.. మునిగిపోవడం కనిపించింది. దీంతో యువకుడి సోదరుడు కాపాడేందుకు ప్రయత్నించి అతడు కూడా మునిగిపోయాడు.. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఓ యువకుడిని ప్రాణాలతో కాపాడారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. వీరిని అంబట్ పల్లికి చెందిన మధుసూదన్ (18), శివ మనోజ్ (15), రజిత్ (13), కర్ణాల సాగర్ (16), కోరకుంట్ల వాసి రామ్ చరణ్ (17), స్తంభంపల్లి వాసి రాహుల్ (19) గా గుర్తించారు. వీరిలో రజిత్ (13) మృతదేహాన్ని వెలికితీశారు.
యువకుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ బిడ్డలు నదిలో మునిగిపోయారనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. రాత్రంతా నది ఒడ్డునే తమ పిల్లల ఆచూకీ లభిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.