Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వాతావరణశాఖ అలర్ట్
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించి 10 రోజులు దాటినా వర్షాలు మాత్రం కురవడం లేదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అలాగే ఇక వర్షకాలం ప్రారంభమైందని అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారు అయింది. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోయాయి. ఇక నేటి నుంచి మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. కనీసం ఇప్పటికైనా వర్షాలు ప్రారంభం అవుతాయా అని ప్రజలు ఆశగా చూస్తున్నారు.
దీంతో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఆవరించిన ద్రోణి బలహీనపడిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తాయన్నారు. దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడిన మోస్తరు వర్షం పడుతుందని అధికారులు సూచించారు.
ఇక ఏపీలోనూ రాగల రెండు రోజుల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ అల్లూరి, కాకినాడ, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తెలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని సూచించింది.