Israel: మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. 66 మంది గాజా వాసుల మృతి

Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులపై శాంతి చర్చలు జరిగినా అవి విఫలమైనట్టే కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించలేదని.. అందుకే దాడులు చేస్తున్నట్టు ప్రకటించారు. దాడులను ఆపేందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 66 మంది చనిపోయినట్టు గాజా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
ఇందులో ఖాన్ యూనిస్ లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్థుల శిబిరంలో 10 మంది చనిపోయినట్టు వివరాలు తెలిపారు. చనిపోయిన 66 మందిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాగా గత నాలుగు రోజులు వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో బాధితులు గాయపడ్డారు.