Published On:

Russia attack on Ukraine: ఉక్రెయిన్ పై రష్యా దాడులు.. 13 మంది మృతి!

Russia attack on Ukraine: ఉక్రెయిన్ పై రష్యా దాడులు.. 13 మంది మృతి!

13 Ukrainian’s Killed in attack by Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎంతకీ ఆగడం లేదు. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ అతలాకులమవుతోంది. తాజాగా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్ సహా పలు నగరాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మరోవైపు రష్యా ప్రయోగించిన 266 డ్రోన్లు, 45 మిస్సైళ్లను ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. దాడులతో ఉక్రెయిన్ కు భారీ నష్టం వాటిల్లింది. నివాస సముదాయాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో దాడులు జరగడంతో పెద్ద ప్రభావం పడింది. ఇక దక్షిణ ఉక్రెయిన్ లోని మైకోలైవ్ లో జరిగిన డ్రోన్ దాడిలో ఓ వృద్ధుడు మరణించగా, ఐదుగురు గాయపడినట్టు గవర్నర్ తెలిపారు.

 

మరోవైపు రష్యా జరుపుతున్న దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. రష్యా దాడులపై అమెరికా మౌనంగా ఉంటోందని.. ఇది పుతిన్ బలం కలిగిస్తోందని అన్నారు. రష్యా, దాని మిత్రదేశాలు పాశ్చాత్య దేశాల్లో మారణకాండను సృష్టించేందుకు మాత్రమే బలగాలను తయారు చేస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ అన్నారు. ఆయుధాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నంత వరకు రష్యా పోరాడుతుందని మండిపడ్డారు. కాగా శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తున్న టైంలో ఈ దాడులు జరగడం గమనార్హం.