Bengal Violence: బెంగాల్ లో ఉద్రిక్తత.. 40 మంది ఆందోళనకారులు అరెస్ట్
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రబీంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఓ మోటరు సైకిల్ కు నిప్పుపెట్టారు. ఘర్షణలను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు గాయపడ్డారు.
కాగా హింసకు సంబంధించి బెంగాల్ పోలీసులు ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. దీనిపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేస్తలలోని 7వ వార్డులో శివాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పుకొచ్చారు. ఆలయ కమిటీ ఆధీనంలో ఉన్న భూమిని కొందరు ఆక్రమించారని తెలిపారు. ఆలయం వద్ద హిందువుల దుకాణాలను తొలగించారని ఆరోపించారు.