Published On:

IMF: పాకిస్తాన్ కు షాక్.. షరతులతో ఐఎంఎఫ్ ఒత్తిడి

IMF: పాకిస్తాన్ కు షాక్.. షరతులతో ఐఎంఎఫ్ ఒత్తిడి

Pakistan: భారత్- పాక్ ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత్ ప్రపంచ దేశాల ముందు నిజాలను బయటపెట్టింది. అయితే తమ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా 20 వేల కోట్ల పాకిస్తాన్ రూపాయల ఆర్థిక సాయం చేయాలని దాయాది దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ను కోరింది. కానీ పాకిస్తాన్ కోరిన ఆర్థిక సాయాన్ని ఆ దేశానికి ఇవ్వొద్దని భారత్ గట్టిగా అడ్డుకొంది. ఆ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని చెప్పింది. అయినా ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేసింది.

 

కాగా పాకిస్తాన్ పై అందిన నివేదికలతో ఐఎంఎఫ్ ఆ దేశంపై ఒత్తిడి పెంచుతోంది. అలాగే పాక్ మీద ఆర్థికపరమైన 11 కొత్త షరతులను విధించింది. దీంతో పాకిస్తాన్ మీద ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి పెరిగింది. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ మీద దాడులకు పాల్పడింది. డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. చివరికి భారత్ జరిపిన ప్రతిదాడులకు తట్టుకోలేక కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది.

 

అయితే ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో జూన్ 2025 లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను పార్లమెంట్ ను ఆమోదించాలి. అలాగే జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్నుల ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచారం కోసం కార్యచరణ తయారు చేయాలి.

 

అలాగే ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేయాలి. 2027 తర్వాత ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళికలు తయారు చేయాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఫిబ్రవరి 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. వీటితో పాటు 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలని ఐఎంఎఫ్ కోరింది. అందుకోసం ఈ ఏడాది చివరిలోగా నివేదిక సమర్పించాలని తెలిపింది.