Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత కీలక వ్యాఖ్యలు
Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటూ సోషల్ మీడియాలో బంగ్లా తాత్కాలిక సర్కారుపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనాను కట్టడి చేయాలని మోదీని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాను వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్ నుంచి సోషల్ మీడియా వేదికగా బంగ్లా తాత్కాలిక సర్కారుపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించినట్లు యూనస్ తాజాగా వెల్లడించారు.
బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో తాను షేక్ హసీనా అంశంపై చర్చించినట్లు యూనస్ తెలిపారు. షేక్ హసీనా ఆన్లైన్ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలను అడ్డుకోవాలని సూచించినట్లు తెలిపారు. అందుకు మోదీ అంగీకరించలేదని, అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని సమాధానం చెప్పారని యూనస్ వెల్లడించారు.