Published On:

G7 Summit : భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది : కెనడా

G7 Summit : భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది : కెనడా

Canada : అంతర్జాతీయ వాణిజ్యరంగంలో వైవిధ్యంగా ముందుకెళ్తున్న భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా సర్కారు స్పష్టం చేసింది. వివిధ సుంకాలు విధిస్తున్న అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వచ్చేవారం అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సమావేశాలకు ప్రధాని మోదీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా సర్కారు ఈ మేరకు స్పందించింది. ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ7 ముఖ్యమైన వేదిక అని కెనడా అంతర్జాతీయ వాణిజ్యశాఖ మంత్రి మనీందర్‌ సంధూ వ్యాఖ్యానించారు.

 

జీ7 ఓ ముఖ్యమైన వేదిక..
కెనడా ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించేందుకు జీ7 సదస్సు ముఖ్యమైన వేదిక అని మనీందర్ అన్నారు. పరస్పర ఆర్థిక సహకారం, జాతి భద్రతకు సంబంధించిన అంశాల గురించి చర్చించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కొంతమంది నాయకులను ఆహ్వానించడంపై స్థానిక నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయని, కానీ, ఆర్థిక సంక్షోభ సమయంలో పరస్పరం సహకరించుకోవాలన్నారు. మన సమస్యలు కొన్నింటిని పరిష్కరించుకోగలగామని, విమర్శలకు పదునుపెడుతున్న నాయకులు విషయాన్ని గుర్తిస్తారని భావిస్తున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. జీ7 సదస్సులో జాతి భద్రత, విదేశీ జోక్యం అంశాలపై చర్చించబోతున్నట్లు ప్రధాని మార్క్‌ కార్నీ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. పరస్పర ఆర్థిక సహకారంపై సదస్సులో చర్చించబోతున్నట్లు తెలిపారు.

 

కెనడా గడ్డపై హింసకు తావులేదు..
మరోవైపు కెనడా గడ్డపై హింసకు తావులేదని ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నా, ముఖాముఖి మాట్లాడాలన్నా జీ7 సదస్సు ఓ చక్కని వేదికని కొనియాడారు. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. దీంతో భారత్‌, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. క్రమంగా రెండుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో మనీందర్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి: