Last Updated:

Liquor scam: ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుస్తున్న లిక్కర్ స్కామ్ ఉచ్చు

ఢిల్లీ మద్యం కుంభకోణం ఉచ్చు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటోంది. మొదట ఆరోపణలే అనుకున్నా ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి.

Liquor scam: ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుస్తున్న లిక్కర్ స్కామ్ ఉచ్చు

Liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం ఉచ్చు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటోంది. మొదట ఆరోపణలే అనుకున్నా ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో లిక్కర్‌ పద్యవ్యూహంలో చిక్కుకున్న కవిత అందులో నుంచి బయట పడేందుకు వెతుక్కుంటున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో లీగల్‌గా ఉచ్చులో ఆమె చిక్కుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ కవిత పేరును మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్‌లో చేరుస్తూ వస్తోంది. అందులో కొన్ని నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇవి రుజువు అయ్యేనా, సచ్చేనా అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నారు కవిత. కానీ ఇదే కేసులో రంగంలోకి దిగిన సీబీఐ కవిత ప్రమేయాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు సంపాదించింది. ఈమేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం కన్ ఫర్మ్ అయినట్లేనా?..(Liquor scam)

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్‌ అయిన సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్‌ బోయిన్‌పల్లి, శరత్‌ చంద్రారెడ్డి బెయిల్‌ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ సమర్పించిన కీలక సాక్షుల ఖాతాలు, ఇతర పత్రాల ఆధారంగా కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు రాఘవ నిందితులతో కలిసి మొత్తం రాకెట్‌ను నడిపినట్లు స్పష్టంగా రుజువు చేసిందని కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొంత మంది నిందితులను ప్రశ్నించాల్సి ఉందని, మనీలాండరింగ్‌ను రుజువు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. దీంతో కవిత ప్రమేయం దాదాపు నిర్ధారణ అయిందని సమాచారం. అరెస్ట్‌ కూడా ఎంతో దూరంలో లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈడీ చేతికి కీలక ఆధారాలు..(Liquor scam)

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ తమ పని తాము చేసుకుపోతున్నాయి. కుంభకోణాన్ని నిరూపించేందుకు, అరెస్ట్‌ తప్పుకాదని ధ్రువీకరించేందుకు తగినన్ని ఆధారాలు సేకరిస్తోంది. కానీ, ఈ స్కాంలో చిక్కుకున్నవారు ఏమీ జరుగట్లేదు అన్నట్లు మిన్నకుండిపోతున్నారు. ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలతో సీబీఐ, ఈడీ ఏం చేస్తున్నాయో.. ఏం చేయబోతున్నాయో స్పష్టంగా అర్థమైంది. వాట్సాప్‌ చాట్‌లు, మొబైల్‌ లొకేషన్‌లు, నగదు లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, హోటల్‌ రికార్డులపై కవిత ప్రమేయం ఉందని ఈడీ తగినన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచింది. దీంతో కోర్టు కూడా నిందితులను ప్రశ్నించాల్సి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇతర నిందితులు దినేష్‌ అరోరా, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైతో కవిత జరిపిన సమావేశాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ కేసులో శరత్‌ చంద్రారెడ్డి కీలక నిందితుడని కూడా వెల్లడించింది.

అప్రూవర్ గా మారనున్న రామచంద్రన్ పిళ్లై..

ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో రామచంద్రన్ పిళ్లై కీలకం. ఇంత వరకూ ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అప్రూవర్‌గా మారారని అన్ని విషయాలు చెబుతున్నారని.. ఆయన వివరాలతోనే దాడులు చేస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే కవిత ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే చెబుతున్నారు.మొత్తంమీద లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయని కోర్టుతోనే చెప్పించింది సీబీఐ. కోర్టు తాజా వ్యాఖ్యలతో కవిత అరెస్ట్‌కు ఇంకా ఎన్నో రోజులు పట్టకపోవచ్చని తెలుస్తోంది. నిందితులను విచారణ చేయాల్సిందే అని కోర్టు స్పష్టం చేయడంతో వీలైనంత త్వరగా కవిత అరెస్ట్‌ ఉంటుందన్న సంకేతాలు ఈడీ నుంచి వెలువడుతున్నాయి. ఇది బీఆర్ఎస్‌కు, కేసీఆర్ కు తీరని దెబ్బగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇవి కూడా చదవండి: