Published On:

PBKS Vs RR: పంజాబ్ నిలుస్తుందా.. నేడు రాజస్థాన్ తో మ్యాచ్

PBKS Vs RR: పంజాబ్ నిలుస్తుందా.. నేడు రాజస్థాన్ తో మ్యాచ్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3.3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్ కు నేటి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. కాగా మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బాగానే రాణించినా.. భారత్- పాక్ ఉద్రిక్తతల నడుమ ఆటను మధ్యలోనే రద్దు చేశారు. దీంతో గెలుపు అవకాశాన్ని పంజాబ్ చేజార్చుకుంది. ఇక నేటి మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ తో మ్యాచ్ కు రెడీ అవుతోంది.

 

కాగా ఐపీఎల్ సీజన్ ను రీషెడ్యూల్ చేయడంతో పంజాబ్ జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు టీమ్ ని విడిచి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఆసీస్ ప్లేయర్లు స్టొయినిస్, ఇంగ్లీస్ తిరిగి వచ్చేందుకు అయిష్టత చూపారు. దీంతో జట్టులోకి మిచెల్ ఒవెన్ తొలిసారిగా వస్తున్నారు. విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న ఒవెన్ గతేడాది బిగ్ బాష్ లీగ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

 

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ లో అంతగా రాణించలేక పోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్ పాయింట్ల టేబుల్ లో చివరిస్థానంలో నిలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 12 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్ ల్లోనే విజయం సాధించి 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిచినా పెద్దగా ప్రయోజనం లేకపోయినా పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై దెబ్బకొట్టే అవకాశం ఉంది.

 

ఇక జట్టులో కీలక ఆటగాడు సంజు సామ్సన్ గాయాలతో కోలుకొని మళ్లీ జట్టులోకి వస్తున్నాడు. అలాగే విదేశీ ఆటగాళ్లు హెట్ మైర్, హసరంగ, తీక్షణ కూడా జట్టులోకి వచ్చేశారు. సీజన్ లో అద్బుతంగా రాణిస్తున్న ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ నిలబడి, పరాగ్, జురేల్ సహకారం అందిస్తే రాజస్థాన్ ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ బౌలర్లలో కీలక ప్లేయర్లు ఆర్చర్, సందీప్ శర్మ జట్టుకు దూరమయ్యారు. దీంతో బౌలింగ్ తో రాజస్థాన్ జట్టు ఇబ్బంది పడుతోంది.