Weather: వచ్చే మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rain Alert: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఏపీలోని మధ్య కోస్తా తీరానికి ఆనుకుని మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
అయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, హన్మకొండ, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలో వడగండ్ల వానలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్తోంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు , మెరుపులు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
కాగా రాష్ట్రంలో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల యాసంగి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వరి, మామిడి, బొప్పాయి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో అన్నదాతలు ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.