AP Government : అహ్మదాబాద్ దుర్ఘటన .. ఏపీ ప్రభుత్వ కార్యక్రమం వాయిదా

‘First step in good governance’ postponed : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి సర్కారు గురువారం సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం కాలంలో సర్కారు ఏం సాధించింది అనే అంశాలు ప్రజలకు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి పునరంకితం అయ్యేలా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సభ్యులు, సచివాలయంలోని కీలక అధికారులను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంతో కార్యక్రమం వాయిదా పడింది.