Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురి మృతి
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో ఏర్పాటు చేసిన గుడిసెలోకి వెళ్లారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడింది. ఘటనలో పెందూర్ మాదర్రావు (45), సంజన (22), మంగం భీంబాయి (40), సిడాం రాంబాయి (45) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని తొలుత ఝురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడిగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. సాంగిడిలో పొలం పనులు చేస్తున్న నందిని (30), సోన్కాస్లో పత్తి విత్తనాలు వేస్తున్న సునీత (35)పై పిడుగు పడగా, వారు అక్కడికక్కడే మృతిచెందారు. దంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఉట్నూర్ మండలం కుమ్మరితండాలో వ్యవసాయ పనులు చేస్తున్న ముగ్గురు రైతులు రహదారిపై వెళ్తున్నారు. వర్షం రావడంతో పొలంలోని పశువుల పాకలోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి కుమ్మరితండాలోని ఒకే కుటుంబానికి చెందిన రైతులు బోకన్ ధన్రాజ్ (27), నిర్మల (36), టోకన్ కృష్ణబాయి (30)లకు గాయాలయ్యాయి. తాంసీ మండలం బండలానాగాపూర్లోని రామాలయంపై పిడుగు పడి పైనున్న ఆలయం గోపురం స్వల్పంగా ధ్వంసమైంది.