Published On:

Bengaluru Stampede: తొక్కిసలాటకు కారణం ఆర్సీబీనే.. కర్ణాటక ప్రభుత్వం ఆరోపణ

Bengaluru Stampede: తొక్కిసలాటకు కారణం ఆర్సీబీనే.. కర్ణాటక ప్రభుత్వం ఆరోపణ

Karnataka Government: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్బంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ, బీసీసీఐ ప్రధాన కారణమని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీకి ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని సర్కార్ వెల్లడించింది. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.

 

జస్టిస్ ఎస్ఆర్ కృష్ణ కుమమార్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కేసును విచారించింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి కోర్టులో వాదనలు వినిపించారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ యాజమాన్యాలే కారణమన్నారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్, స్టేడియం లోపల సన్మాన వేడుకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన కోర్టుకు వివరించారు.

 

సోషల్ మీడియా ద్వారా నిర్వాహకులు ఆహ్వానించారని, పరేడ్ కు గంట ముందు మాత్రమే సమాచారం అందించారన్నారు. కేవలం ఈవెంట్ గురించి సమాచారం మాత్రమే ఇచ్చారని, అనుమతి తీసుకోలేదన్నారు. విక్టరీ ర్యాలీ, సన్మాన సభకు సంబంధించిన సమాచారం కేవలం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మాత్రమే వచ్చిందని, ఆర్సీబీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.

 

స్టేడియం కెపాసిటీ 33 వేలు ఉంటే, 3.5 నుంచి 4 లక్షల మంది స్టేడియం వద్ద వచ్చారని అందులో ఎవరినీ లోపలికి అనుమతిస్తారో నిర్వాహకులు చెప్పలేదన్నారు. దీంతో స్టేడియం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాట జరిగిందని కోర్టుకు తెలిపారు.