RCB: మా మీద కేసులు కొట్టేయండి.. కర్ణాటక హైకోర్టుకు ఆర్సీబీ
Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక పరిణామం నెలకొంది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ర్యాలీకి పెద్దఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారని ఆరోపిస్తూ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్ లో పేర్కొంది.
స్టేడియంలో తగినంత మంది పోలీసులు లేరని తెలిపింది. ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తమను కేసులో ఇరికించారని డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమం జరిగిందని, సీఎస్ కూడా స్వయంగా ఎర్పాట్లను పర్యవేక్షించారని ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. కాగా తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆర్సీబీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.