Published On:

Pakistan: భారత్ ను కాపీ కొడుతున్న పాక్.. విదేశాలకు ప్రతినిధుల బృందం

Pakistan: భారత్ ను కాపీ కొడుతున్న పాక్.. విదేశాలకు ప్రతినిధుల బృందం

Operation Sindoor: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమంటే పాకిస్తాన్ పనులను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ నష్టపోయేది నక్కే అన్న చందంగా. భారత్ చేస్తున్న చర్యలకు పోలికగా పాకిస్తాన్ అలానే చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి పనులు చేసి ప్రపంచం ముందు నవ్వులపాలైనా ఆ దేశానికి ఇంకా బుద్ధి రావడంలేదు.

 

తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు నిర్ధారించుకున్న భారత్.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఉగ్రవాదాన్ని అంతమొందిచాలనే లక్ష్యంతో ఉగ్రవాదలను భారత్ మట్టుబెడితే.. దానికి ఆనందించాల్సిన పాకిస్తాన్.. భారత్ పైకి దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి, ఉగ్రవాదలకు అండగా నిలుస్తోందని స్పష్టంగా అర్థమైంది.

 

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసింది. అయితే పాక్ దాడులను భారత్ ధీటుగా తిప్పికొట్టింది. చివరికి తామే నష్టపోతున్నామని గ్రహించిన దాయాది దేశం కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మానుకోవట్లేదు. భారత్ ఎలాంటి అడుగులు వేస్తుందో.. పాకిస్తాన్ కూడా అలాంటి ఆలోచనలే చేస్తోంది. ఈనేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది.

అందుకు ఏడు బృందాలను సిద్ధం చేసి ప్రపంచ దేశాలకు పంపుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ తమపై జరిపిన దాడుల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పాక్ విదేశాంగ మాజీ మంత్రిబిలావల్ భుట్టో నేతృత్వంలో ఓ బృందాన్ని విదేశాలకు పంపాలని ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం.

 

ఈ విషయమై ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. సరిహద్దులో ఉద్రిక్తతలపై అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాలకు తమ వైఖరిని తెలిపేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రతినిధి బృందంలో డిప్యూటీ విదేశాంగ మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్, రక్షణశాఖ మాజీ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్, విదేశాంగ మాజీ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. కాగా పాకిస్తాన్ బృందానికి నాయకత్వం వహించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ తనను కోరినట్టు భుట్టో పేర్కొన్నారు.