2 Terrorist arrested in AP: విజయనగరంలో ఉగ్రమూలాలు, రిమాండ్ లో ఇద్దరు దుండగులు!

2 Terrorist arrested in Vizianagaram: విజయనగరంలో బాంబుపేలుళ్లతో అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ విజయనగరం, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో నిందితులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా.. ఇందులో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు. ఈ ఆరుగురి ముఠా 3 రోజుల పాటు హైదరాబాద్లో కలిసే ఉన్నారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై వీరు చర్చించారు. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా.. మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమీర్ అనే యువకుడిని అరెస్ట్ చేయడం సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడలో కలకలం రేపింది. బోయిగూడలోని కళారంగ్కాలనీలో.. 16వ తేదీన సమీర్నువిజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. సమీర్ తన తల్లి సబెర, చెల్లి అలియాతో కలసి ఉంటున్నాడు. దీంతో బోయిగూడ కాలనీలో భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడూ తమతో గొడవలు పడేవారంటూ బస్తీవాసులు చెబుతున్నారు. వెంటనే వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతున్నారు. ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచులతో.. రూమ్లో సమావేశం అయ్యేవారని చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులు వెల్లడించారని బస్తీవాసులు చెబుతున్నారు.