Pakistan: భారత్ దెబ్బకు భయపడిన పాక్.. ఆర్మీ చీఫ్ ఆఫీస్ మార్పు

Operation Sindoor: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో దాయది దేశానికి పెద్ద నష్టమే జరిగింది. భారత్ దాడులకు భయపడి.. మన భద్రతా బలగాల ముందు నిలవలేకపోయింది. చివరికి తమని తాము కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.
కాగా జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఆందోళన పరిస్థితులు మరింత పెరిగాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది చంపేశారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ పక్కా ఆధారాలతో నిర్ధారించుకుంది. దీంతో పహల్గామ్ దాడికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. కాగా భారత ఆర్మీ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టమయ్యాయి. 100 పైగా ముష్కరులు హతమయ్యారు. దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులు, సన్నిహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని మసూద్ అజార్ బహిరంగ లేఖను విడుదల చేశాడు.
అయితే భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ పై దాయాది పాక్ రియాక్ట్ అయింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసింది. మరోవైపు పాక్ దాడులను అరికడుతూనే భారత్ దళాలు పాకిస్తాన్ లోని పలు స్థావరాలపై దాడులు జరిపాయి. దాడుల్లో పాకిస్తాన్ కు తీవ్రనష్టం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, పలు ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి.
ఇక భారత్ మిస్సైళ్ల దాడికి భయపడిపోయిన పాకిస్తాన్ రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కార్యాలయాన్ని ఇస్లామాబాద్ కు మార్చాలని పాకిస్తాన్ రక్షణశాఖ అనుకుంటుందట. కాగా భారత్ మిస్సైళ్ల దాడికి రావల్పిండి అనువుగా ఉండటంతో ఇక్కడ నష్టం జరిగింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ బంకర్ లో దాక్కున్నట్టు సమాచారం. అయితే ఇస్లామాబాద్ సురక్షితమైన ప్రదేశమని పాక్ ప్రభుత్వం భావిస్తోందట. ప్రస్తుతం ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచే పాక్ తన అణ్వాయుధాల నిర్వహణను చేపడుతోంది. అయితే భారత్ ఉపయోగిస్తున్న బ్రహ్మోస్ క్షిపణితో పాకిస్తాన్ కి పెద్ద నష్టం జరగొచ్చు. అందుకే ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్స్ మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోందని సమాచారం.