Purandeswari : దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం దక్కింది : పురందేశ్వరి

MP Purandeshwari has a chance in seven all-party groups : భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి చోటు దక్కింది.
మొత్తం 59 మందితో ఏడు అఖిలపక్ష బృందాలు..
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఘటన నేపథ్యంలో ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ దౌత్య యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 33 దేశాల రాజధానులకు వెళ్లేందుకు వివిధ పార్టీలకు చెందిన మొత్తం 59 మందితో ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది.
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాల్లో పర్యటించే 8 మంది సభ్యుల బృందంలో ఎంపీ పురందేశ్వరి ఉన్నారు. బృందానికి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తారు. పహల్గాం ఉగ్రదాడిలో 26మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతిగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదం గురించి వారు వివరించనున్నారు.
ఆనందంగా ఉంది : పురందేశ్వరి
అనేక ఏళ్లుగా భారత్ను దెబ్బతీసేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్ బుద్ధిని ప్రపంచ దేశాల ముందు బయటపెట్టడానికి ఏర్పాటుచేసిన అఖిలపక్ష బృందంలో తనకు చోటు దక్కడం ఆనందంగా ఉందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొని ప్రాణాలు మృతిచెందిన వీర జవాన్లు, పౌరులకు నివాళులర్పించడానికి ఇదొక చిన్న మార్గమని ఆమె పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చిన అరుదైన అవకాశంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు.