Shashi Tharoor & Delegation: పాక్ ఉగ్రవాదాన్ని వివరిస్తాం.. విదేశాలకు శశిథరూర్ బృందం!

Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది.
కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, పహల్గామా ఉగ్రదాడి గురించి వివిధ దేశాల్లో వివరించేందుకు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందాలు ఆయా దేశాలకు బయల్దేరాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వంలోని ఎంపీల బృందం ప్రపంచదేశాల పర్యటనకు బయల్దేరింది.
శశిథరూర్ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా వెళ్లనుంది. దీంతో ఈరోజు తెల్లవారుజామున వారు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ.. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని దేశం తరపున వినిపించేందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదులు చెలరేగిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోందని తెలిపారు.