KCR Convoy: కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం
KCR Convoy Accident: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్యాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ లోని కార్ఖాన వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొంది. దీంతో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రమాదంలో మరో కారు కూడ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దీంతో నేతలు పార్టీ కార్యకర్తలను సముదాయించారు.
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలి నుంచి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి పైనుంచి పక్కకు తప్పించారు. అనంతరం నేతలు మరో కారులో బీఆర్కే భవన్ కు వెళ్లారు. కాగా కాళేశ్వరం విచారణ నిమిత్తం కేసీఆర్ బీఆర్కే భవన్ కు వెళ్లారు. అక్కడ జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను విచారించనున్నారు. కేసీఆర్ వెంట హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సహా.. పలువురు నేతలు ఉన్నారు.