Shashi Tharoor: ప్రధానిపై రాహుల్ కామెంట్స్.. శశిథరూర్ కౌంటర్

Shashi Tharoor on Rahul: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడుల విషయంలో ప్రధాని మోదీపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం పలువురు ఎంపీలతో ప్రతినిధి బృందాలను పంపింది. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో అమెరికాకు వెళ్లే బృందాన్ని పంపింది.
తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ వివాదానికి సంబంధించి ఏ సమయంలోనూ, ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం చేస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వాదనలను ప్రస్తావించారు. “భారత్ ను యుద్ధం ఆపమని ఒప్పించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆగితే, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వారు పాకిస్తాన్ ను మీరు ఆపండి ఎందుకంటే భారత్ ఆపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండవచ్చు. అమెరికా అదే చేసింది. అది అమెరికా వైపు నుంచి చెప్పుకోదగిన చర్య” అని అన్నారు.
ఇటీవల ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ పై దాడుల గురించి తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ ఫోన్ లో నరెందర్ సరెండర్ అనగానే యుద్ధం ఆపేశారని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధ సమయంలో కూడా అమెరికా ఒత్తిడి చేసినప్పటికీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలపై శశిథరూర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగితే, భవిష్యత్తులో కూడా అంతకుమించిన స్థాయిలో భారత్ బదులిచ్చేందుకు సిద్ధంగా ఉందని శశిథరూర్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం, వారిలాగే స్పందించేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తాము అదే భాషను ఉపయోగిస్తామన్నారు.