Published On:

Pakistan : సిమ్లా ఒప్పందంపై ఏ నిర్ణయం తీసుకోలేదు : పాక్ విదేశాంగ శాఖ

Pakistan : సిమ్లా ఒప్పందంపై ఏ నిర్ణయం తీసుకోలేదు : పాక్ విదేశాంగ శాఖ

Pakistan : భారత్‌తో 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగే అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేదని పాక్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్‌ మాట్లాడారు. సిమ్లా ఒప్పందానికి విలువలేదని పేర్కొన్నారు. అదొక డెడ్‌ డాక్యుమెంట్‌ అన్నారు. సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేశారో లేదో తెలియదు గానీ, సిమ్లా అగ్రిమెంట్‌ పనైపోయిందని పేర్కొన్నారు. దీంతో తాము 1948 నాటి స్థితికి చేరుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఉన్న నియంత్రణ రేఖ కేవలం కాల్పుల విరమణ రేఖగా భావిస్తామన్నది ఆయన ఉద్దేశం. 1948 భారత్‌-పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా విదేశాంగశాఖ ప్రతినిధి వివరణ ఇచ్చారు. భారత్‌తో ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సిమ్లా ఒప్పందంతోపాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయని ఆ దేశానికి చెందిన ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌కు వివరించారు. 1971లో భారత్‌-పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం భారత్‌-పాకిస్థాన్ సంబంధాల నిర్వహణకు సంబంధించిన చర్యలు తీసుకుంటారు.

 

ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. ఇందులో కశ్మీర్‌ అంశమూ కూడా ఉంది. ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్‌ అలీ భుట్టో సంతకాలు చేశారు. దీని ప్రకారం రెండుదేశాలు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో కాల్పుల విరమణ లైన్‌గా నియంత్రణ రేఖను పునర్నిర్వచించడం. దానిని మార్చకూడదన్న నిర్ణయానికి ఇరుదేశాలు కట్టుబడటం. బంగ్లా సార్వభౌమత్వాన్ని గుర్తించడంతోపాటు ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాక్ కట్టుబడటం వంటి అంశాలు ఉన్నాయి.

 

ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి భారత్‌-పాకిస్థాన్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. తర్వాత మే 7న పాక్‌, పీవోకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. మే 8,9,10 తేదీల్లో పాక్ సైన్యం భారత మిలిటరీ బేస్‌లపై దాడికి యత్నించింది. దీంతో మన దళాలు తిప్పికొట్టాయి. ఆ తర్వాత పాక్ అభ్యర్థన మేరకు ఇండియా ఆపరేషన్‌ సిందూర్‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

ఇవి కూడా చదవండి: