Published On:

India banned pakistan ships: పాక్ కు భారత్ మరో దెబ్బ.. ఆ దేశ నౌకల ఎంట్రీపై నిషేధం

India banned pakistan ships: పాక్ కు భారత్ మరో దెబ్బ.. ఆ దేశ నౌకల ఎంట్రీపై నిషేధం

Ships: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. జమ్ముకాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్ తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాక్ తో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటోంది.

సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరోవైపు పాక్ నుంచి వస్తున్న అన్ని దిగుమతులపై నిషేధం విధించింది. అలాగే భారత్ లో నివసిస్తున్న పాకిస్తాన్ వాసులను వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. అలాగే పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, ఇన్ స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్ సైట్లను మూసివేసింది. ఇలా భారత్ చేపట్టిన చర్యలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది.

తాజాగా భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలు భారత జలాల్లోకి, పోర్టులకు రాకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదేశాలు అమలు చేయబడతాయని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే దేశ భద్రత, పౌర రక్షణ, నౌకదాళ భద్రత వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.