Published On:

Attack on Actress Ramyasri: సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై దాడి.. క్రికెట్‌ బ్యాట్‌, కత్తులతో

Attack on Actress Ramyasri: సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై దాడి.. క్రికెట్‌ బ్యాట్‌, కత్తులతో

Attack on Tollywood Actress Ramyasri and her Brother: టాలీవుడ్‌ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఅవుట్‌లో హైడ్రా రోడ్ల మార్కింగ్‌ చేపట్టగా.. ప్లాట్‌ యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్‌ చేశారు. ప్లాట్‌ ఓనర్లలో ఒకరైన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌ వీడియో తీశారు. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్ అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. వీడియోలు ఎందుకు తీశారంటూ వారి ఫోన్‌లు లాక్కున్నారు.

 

తమ స్థంలో తాము వీడియో తీసుకుంటే మీకేంటి ఇబ్బందని రమ్యశ్రీ ప్రశ్నించగా.. వారు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. క్రికెట్‌ బ్యాట్‌, కత్తితో రమ్యశ్రీతో పాటు ఆమె సోదరుడిపై దాడికి దిగారు. దీంతో ప్రస్తుతం ఘటన గచ్చిబౌలిలో కలకలం రేపుతుంది. శ్రీధర్ అనుచరులు దాడిలో రమ్యశ్రీ, ఆమె తమ్ముడికి గాయాలయ్యాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సంధ్యా కన్వెన్షన్‌ ఓనర్‌ శ్రీధర్‌, అతడి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై రౌడీయిజం చేస్తున్నారని, అతడి అనుచరులు తమపై దాడి చేశారని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో రమ్యశ్రీ పేర్కొన్నారు. ర‌మ్య శ్రీ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

 

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిని అనుకుని ఉన్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో సంధ్య కన్వెన్షన్ ఆక్రమణలను హైడ్రా అధికారులు నెల రోజుల క్రితం తొలగించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేకుండా నిర్మించిన మినీ హాల్, రెండు షెడ్లు, కొన్ని గదులను హైడ్రా కూల్చివేసింది. అయితే సంధ్య కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు ఎఫ్‌సీఐ లేఔట్‌లో రోడ్ల పార్కింగ్‌ లేకుండ చేశారని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతి మేరకు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా అధికారులు మంగళవారం ఎఫ్‌సీఐ లేఔట్లలో రహదారుల గుర్తింపు పనులు చేపట్టారు. లైన్‌ల మార్కింగ్ చేస్తుండగా లేఔట్‌లో ఓ ప్లాట్ యజమానిగా ఉన్న రమ్యశ్రీ, తన సోదరుడు ప్రశాంత్‌తో కలిసి అక్కడికి వెళ్లింది.

 

లైన్స్‌ మార్కింగ్‌ చేస్తుండగా వారు తమ ఫోన్‌లో వీడియో తీశారు. అనంతరం మధ్యాహ్నం లంచ్‌కు వెళ్తున్న సమయంలో రమ్యశ్రీ, ఆమె సోదరుడిని కొందరు అడ్డుకుని వీడియోలు ఎందుకు తీశారని బెదిరించారు. వారి వద్ద నుంచి ఫోన్ లాక్కునేందుకు చూడగా, అడ్డుకున్న ప్రశాంత్‌ను నిందితులు కొట్టారు. వారు సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌ రావు అనుచరులని తెలిసింది. దీంతో ఏ తప్పు లేకున్నా తమపై దాడి చేసిన సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు అనుచరులపై చర్యలు తీసుకోవాలి గచ్చిబౌలి పోలీసులకు నటి రమ్యశ్రీ ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌ స్పందించారు. పోలీసులు బందోబస్తు నడుమ అధికారులు లేఔట్ రోడ్ల మార్కింగ్ చేశారన్నారు. అయితే తమ సమక్షంలో ఈ గొడవ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా నటి రమ్యశ్రీ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో ఆమె మొదట హీరోయిన్‌గా కెరీర్ మొదలుపట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసింది. కాస్తా బోల్డ్‌ రోల్స్‌లో నటించిన ఆమె కొంతకాలం తర్వాత వెండితెరకు దూరమైంది