Published On:

eKyc Deadline: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ కేవైసీ గడువు పెంపు

eKyc Deadline: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ కేవైసీ గడువు పెంపు

Ration Card: ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులంతా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. అందుకోసం 2025 ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తున్నట్టు గతంలో ప్రకటించింది. గడువు సమయానికి ఈ కేవైసీ చేయించుకోని లబ్ధిదారులకు రేషన్ బియ్యం, సరుకుల పంపిణీని నిలిపివేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. కానీ గడువు ముగిసినా కొందరు లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వం వారికోసం మరో అవకాశాన్ని కల్పించింది. వచ్చే జూన్ 30 నాటికి రేషన్ కార్డు లబ్దిదారులు వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది.

అయితే రాష్ట్రంలో ఉన్న బోగస్, నకిలీ లబ్దిదారులను తొలగించేందుకే రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో అసలైన లబ్దిదారులకు రేషన్ సరుకులు అందుతాయని పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఈ కేవైసీ చేయించుకునేందుకు లబ్దిదారులు ముందుకు వస్తున్నా.. వారికి అనేక సమస్యలు ఎదరవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడం, పౌరసరఫరాలశాఖ అధికారులు, రేషన్ డీలర్లు వచ్చే సమయానికి ప్రజలు ఇళ్ల వద్ద ఉండకపోవడం, సాయంత్రం రేషన్ షాపుల వద్ద వెళ్తే అవి మూసి ఉండటం వంటి కారణాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొందరు వేరే ప్రాంతాల్లో ఉండడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గడువు పెంచింది.

అయితే రాష్ట్రంలో ప్రతి లబ్దిదారునికి న్యాయం చేస్తామని, ఏ ఒక్కరినీ రేషన్ కార్డు నుంచి తొలగించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లబ్దిదారులు ప్రస్తుతం ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారో.. ఆ ప్రాంతం నుంచే ఈ కేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే గడువు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయితే వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే లబ్దిదారులంతా తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు.