CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. శాఖల కేటాయింపు కోసమేనా!
Congress: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. అయితే తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించేందుకేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు ఉదయం 10.20 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త మంత్రులకు ఎలాంటి శాఖలు అప్పగిస్తారనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్న శాఖల నుంచే శాఖలు కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను మార్చుతారా అనేది తేలాల్సి ఉంది. అయితే కేబినెట్ లో కొందరు మంత్రుల తీరుతో తరచూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఉత్కంఠగా మారింది. మరోవైపు పాలన సవ్యంగా సాగేందుకుగాను తన వద్ద ఉన్న శాఖలనే సీఎం రేవంత్ కేటాయించే అవకాశం ఉందని టాక్.
అలాగే మంత్రులకు శాఖల కేటాయింపు సహా.. పీసీసీ కార్యవర్గ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి ప్రజలకు తెలిసేలా భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమచారం.