NEET PG 2025 : ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష.. వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి

NEET PG-25 Entrance Exam : నీట్ పీజీ-25 ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహణకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎన్ఈబీ)కు తాజాగా ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది.
వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షకు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. పరీక్షను రెండు షిఫ్ట్ల్లో నిర్వహించడానికి నిరాకరించింది. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. నీటి పరీక్ష నిర్వహణలో పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన కేంద్రాలను ఎంచుకోవాలని సూచించింది. రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకేరకమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయ పడింది. పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కు ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని, ఏటా నిర్వహించుకొనే పరీక్షకు అది సరికాదని సుప్రీం పేర్కొంది.
నీట్-పీజీ 2025ని రెండు ఫిఫ్ట్ల్లో నిర్వహిస్తారంటూ నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. పిటిషన్లపై విచారణలో భాగంగా ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు రెండు వారాలకు పైగా గడువు ఉన్నందున సురక్షితమైన పరీక్షా కేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లకు టైమ్ సరిపోదని అధికారులు భావిస్తే.. తేదీని పొడిగించుకునే స్వేచ్ఛను ఇస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే తేదీ మార్పు చోటుచేసుకుంది.