Free RTC Buses in Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
Free RTC Buses in Tirumala: తిరుమలలో భక్తులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమలలో ప్రైవేట్ వాహనాల వారు భక్తుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతోపాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలో బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని చెప్పారు.
ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులు, ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మ రథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజూ 300 ట్రిప్పులను తిప్పుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు తోడవ్వడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి రెండు నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజారవాణా వ్యవస్థ బలోపేతమవ్వడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయన్నారు.
భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఏ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఎక్కినా తిరుమల నుంచి తిరుపతికే ఛార్జీలు ఉంటాయని తెలిపారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆర్టీసీ బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకుకోవాలని కోరారు.