PM Modi Released Yoga Day Message: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్దఎత్తున పాల్గొనాలి: ప్రధాని మోదీ పిలుపు!

PM Modi Releases letter with Yoga Day Message: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని మోదీ విడుదల చేశారు.
‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’..
ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సం ఘనంగా జరుపుకోనున్నామని చెప్పారు. చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు గొప్ప కార్యక్రమానికి అందిస్తున్న ఆదరణ ఒక ప్రత్యేకం అన్నారు. పదేళ్లుగా యోగా కేవలం దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణని కొనియాడారు. ఈ నెల 21వ తేదీన విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’అనే థీమ్తో ముందుకెళ్తున్నామని తెలిపారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు.
యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం..
యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం అన్నారు. ఇది శరీరం, మనసు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయ పడుతుందని చెప్పారు. యోగా ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. శారీరకంగా మానసికంగా సాధికారత పొందిన ప్రజలు దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తారని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనమన్నారు.
యోగా ద్వారా మనం స్వావలంబన, అభివృద్ధి చెందిన దేశం అనే మన జాతీయ సంకల్పాన్ని మరింత బలంగా, వేగంగా సాధించగలుగుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.