Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. భారత్ కు పెద్ద విజయం

Terrorist: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. జమ్ముకాశ్మీర్ లో పర్యటనకు వచ్చిన అమాయక పర్యటకులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల్లో 26 మంది హతమయ్యారు. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్రం వెల్లడిస్తూ.. అందుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య, వ్యూహాత్మక చర్యలకు దిగింది. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది.
అనంతరం నిన్న తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలైన 9 ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించి వాటిని ధ్వంసం చేసింది. దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్ లు హతమైనట్టు సమాచారం. మృతుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులు 10 చనిపోయారని తెలుస్తోంది. అతని సహచరులు నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
కుటుంబీకులు చనిపోవడంపై జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కీలక ప్రకటన చేశాడు. దాడులకు తగిన సమాధానం చెప్తామని అన్నాడు. దాడులకు పాల్పేందుకు ఆదేశాలు ఇచ్చిన భారత ప్రధాని మోదీని వదిలిపెట్టేదిలేదని హెచ్చరించాడు. అయితే దాడుల్లో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, కుమారుడు, కుమార్తె, మసూద్ సోదరులు, మసూద్ కుమారులు చనిపోయినట్టు సమాచారం.
అయితే తాజా సమాచారం ప్రకారం మృతుల్లో జైషే మహ్మద్ సుప్రీం కమాండర్, మసూద్ అజార్ సోదరడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇతను పాకిస్తానీ దేవబంది జిహాదిస్ట్ మతాధికారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. భారత్ పై దాడులు చేసేందుకు ప్లాన్స్ వేస్తుంటాడు. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని హైజాక్ చేయడంలో కీలక సూత్రధారి. జైల్లో ఉన్న తన అన్న, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను జైలు నుంచి విడిపించాడు. అలాగే భారత్ లో జరిగిన అనేక దాడుల్లో అబ్దుల్ రవూఫ్ ప్రణాళికలు చేశాడు. 2001 పార్లమెంట్ పై దాడి, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీపై అటాక్, 2016లో పఠాన్ కోట్ ఏవియేషన్ క్యాంప్ పై దాడి, 2019 పుల్వామా దాడి వెనుక ఇతని హస్తం ఉందని తేలింది.