Shashi Tharoor : ఉగ్రవాదం గురించి మాట్లాడాను.. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : ఎంపీ శశిథరూర్

Shashi Tharoor posts on ‘X’ saying it didn’t mention wars : బీజేపీకి అనుకూల మాట్లాడుతున్న ఎంపీ శశిథరూర్పై ఆ పార్టీ నాయకుడు ఉదిత్రాజ్ మండిపడ్డాడు. బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా థరూర్ను నియమించాలంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా శశిథరూర్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
తన దగ్గర ఎక్కువ సమయం లేదని పేర్కొన్నారు. గతంలో నియంత్రణరేఖ వెంట భారతీయ శౌర్యం గురించి తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్న వారి గురించి ఇప్పుడు స్పందిస్తున్నట్లు చెప్పారు. తాను ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతీకార చర్యల గురించే మాట్లాడినట్లు వివరించారు. గత దాడులను గురించి ప్రస్తావించలేదన్నారు. ఇటీవల భారత్పై జరిగిన దాడులు, దానికి కేంద్రం స్పందించిన విధానాల ఆధారంగా తాను మాట్లాడినట్లు ఒప్పుకున్నారు. ఎప్పటిలాగా కొందరు విమర్శకులు, ట్రోలర్లు తమకు తగినట్లుగా తన వ్యాఖ్యలను వక్రీకరించడంలో విజయం సాధించారన్నారు. తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని థరూర్ రాసుకొచ్చారు.
పనామాలో థరూర్ విలేకరులతో మాట్లాడారు. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ల సందర్భంగా తొలిసారిగా భారత్ పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో పార్టీ నేత ఉదిత్రాజ్ మాట్లాడుతూ.. ప్రియమైన శశిథరూర్, మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేదన్నారు. మీరు భారత్కు తిరిగి వచ్చేలోగా మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేదని జోస్యం చెప్పారు. మోదీ ప్రధాని కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరే అన్నారని, తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారని మండిపడ్డారు.
1965లో భారత్ పాక్లోని లాహోర్ సెక్టారులో పలు ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాక్ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా పలు సర్జికల్ స్ట్రైక్లు నిర్వహించారు. విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదన్నారు. మీకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, పార్టీపై నిజాయతీ లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారని థరూర్ను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శశిథరూర్ స్పందించారు.