TDP Mahanadu 2025 Food Menu: మహానాడులో పసందైన వంటలు.. మెనూలో 22 ఐటెమ్స్!

22 Food Items in TDP Mahanadu 2025 Menu: కడప వేదికగా నేటి నుంచి మూడు రోజులపాటు టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు కడపకు చేరుకుంటున్నారు.
కాగా మహానాడుకు హాజరయ్యే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం పసందైన వంటకాలతో కడుపు నింపనున్నారు. రోజుకు 30 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మహానాడు చివరిరోజు 3 లక్షల మందికి వడ్డించేందుకు వంటకాలను రెడీ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మెనూలో అదిరిపోయే వంటకాలను చేర్చారు. సుమారు 22 రకాల ఐటెమ్స్ అతిథులకు నోరూరించనున్నాయి. జర్మనీ విభాగం విందు ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం టిఫిన్స్ నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ కి పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తోంది.
అల్పాహారంలో 8 రకాలు ఏర్పాటు చేశారు. అందులో ఇడ్లీ, వడ, పొంగల్, ఉప్మా, దోశ, చట్నీ, సాంబారు, కారంపొడి, నెయ్యి, టీ ఇస్తున్నారు. ఇక మధ్యాహ్నా భోజనంలో 22 రకాల వంటకాలను వడ్డించనున్నారు. అందులో ఖాజాలు, బొబ్బట్లు, హల్వా, చక్రపొంగలి, మైసూర్ పాక్, మామిడికాయ పచ్చడి, టమాటా రైస్, కొబ్బరి అన్నం, వెజ్ పులావ్, పుల్కా, చపాతీ, సొరకాయ పప్పు, అన్నం, టమోటా కాజు ములక్కాయ కూర, గుత్తి వంకాయ కూర, మూడు రకాల వేపుళ్లు, రెండు రకాల ఇగురు కూరలు, కుర్మా సిద్ధం చేస్తున్నారు. ఇక నాన్ వెజ్ ప్రియుల కోసం కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, బిర్యానీ, ఎగ్ ఫ్రై, కోడిగుడ్డు మసాలా, ఉలవచారు, రసం, పెరుగు, అప్పడాలు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ , పాన్ వడ్డించనున్నారు. మొత్తానికి మహానాడు కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులకు అదిరిపోయే విందు తయారవుతోంది.