Jaipur Central Jail: పోలీసులకు లంచం.. ఖైదీలకు ప్రియురాళ్లతో గడిపేందుకు సమయం!

Jaipur Central Jail: ధనం గుమ్మరిస్తే చాలు జైలులో అన్నిపనులు అవుతాయని చాలా సార్లు విన్నాం. ఈ విషయాన్ని శిక్షా కాలం పూర్తిచేసుకుని జైలునుంచి బయటకు వచ్చిన నేరస్థులు చెప్పిన విషయాలే. ఒకరకంగా ఓపెన్ సీక్రెట్. అయితే తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో కొందరు ఖైదీలు వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వచ్చి హోటళ్లలో వారి భార్యలతో, ప్రియురాల్లతో గడిపారు. వైద్యపరీక్షలకు వెళ్లిన ఖైదీలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జైపూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, కరణ్ గుప్తా, అంకిత్ బన్సాల్, భన్వర్ లాల్ అనే నలుగురు ఖైదీలను కానిస్టేబుళ్లు వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దొరికిందే అదనుగా గార్డులకు ఒక్కోక్కరికి రూ.5వేలు ఇస్తామని ఆశ చూపారు. సాయంత్రం ఐదుగంటల వరకు స్వేచ్చగా ఉండనివ్వాలని గార్డులను కోరారు. అందుకు వాళ్లు అంగీకరించారు. అలా బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అధికారులు గాలించారు. ఓ హోటల్ లో రఫీక్ తన భార్యతో, భన్వర్ తన ప్రియురాలితో ఉన్నారు. పైగా రఫీక్ భార్య వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆవిడని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మిగితా ఇద్దరు కూడా జైపూర్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. కరణ్ తో పాటు ఉన్న అతని బందువు వద్ద రూ.45వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
జైలులో ఉన్న ఖైదీలు కానిస్టేబుళ్లకు లంచం ఇచ్చి దొంగతనంగా ఫోన్లు వాడుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో సహా పలువురు వీఐపీలకు జైలునుంచే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లను, నలుగురు ఖైదీలు, వారి రిలేటివ్స్ తో సహా మొత్తం 13మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.